జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలంటే పెద్ద ఉద్యోగం వస్తే సరిపోతుంది. కానీ అలాంటి ఉద్యోగాలు అందరికీ వస్తాయా అంటే కచ్చితంగా రావు. ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగాన్వేషణలోనే సగం జీవితం కోల్పోయి ఆ సమయంలో ఏదైనా వ్యాపారం పెడదామన్నా సరైన సహకారం ఉండదు. అలానే చాలామంది యువకులు మిగిలిపోతుంటారు. కానీ వారికి భిన్నంగా ఓ వైపు సివిల్స్ కు సిద్ధమవుతూ.. మరోవైపు డెయిరీ ఫాం నిర్వహిస్తూ ఆర్శంగా నిలుస్తున్నారు.
మాది చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలోని మంగళంపేట గ్రామం. నా చిన్నప్పటి నుంచి మా అమ్మానాన్నలు ఆవులు, గేదెలు పెంచుతూ పాలమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ.. ఆ పనులు చేస్తూ పెరిగాను. ప్రారంభంలో ఎక్కువగా గేదెలు ఉండేవి. ఆ తర్వాత క్రమక్రమంగా ఆవుల వైపు మారాం. ప్రస్తుతం 14 ఆవులు, 5 దూడలు ఉన్నాయి.
ఎక్కడా కొనుగోలు చేయలేదు..
మా దగ్గర ఎక్కువ భాగం హెచ్ఎఫ్ రకానికి చెందిన ఆవులే ఉన్నాయి. ఒక రెండు మూడు మాత్రం క్రాస్ రకానికి చెందినవి. ఈ ఆవులన్నీ ఎక్కడా కొనుగోలు చేయలేదు. నా చిన్నప్పటి నుంచి ఆవులు, గేదెలు ఉన్నాయి. అయితే ఆవుల నుంచే దూడలు ఇలా సంత వృద్ధి చెందింది. ఇదే క్రమంలో గేదెలను విక్రయించుకుంటూ వచ్చాం. ఇప్పుడు పూర్తిగా మా దగ్గర ఆవులే ఉన్నాయి. దాదాపు ఈ ఆవులన్నీ శాలివాహన అనే ఆవు నుంచే ఉత్పత్తి అయ్యాయి. దాదాపు 14 ఏళ్లుగా ఇలా పెంచుతున్నాం. ఈ క్రమంలో ఇంకా చాలా ఆవులు పెరిగాయి. వాటిలో కొన్నింటిని అమ్మాం. దూడల దశలోనే విక్రయిస్తాం. ఆవులను అయితే అంటిపెట్టుకుంటాం.
ప్రభుత్వం అందించిన రాయితీతో..
మేం ఇప్పటి వరకు వీటికి గడ్డినే మేతగా వేశాం. అయితే ప్రభుత్వం తాజాగా రాయితీపై మొక్కజొన్న, జొన్న విత్తనాలను అందిస్తోంది. వీటితో పాటు సూపర్ నేపియర్, ఎండుగడ్డి పశువులకు ఆహారంగా అందిస్తున్నాం. దాదాపు 3-4 ఎకరాల్లో గడ్డిసాగు చేపట్టాం. వీటిన్నింటిని మిక్స్ చేసి అన్నీ సమపాళ్లలో అందిస్తున్నాం. దాణా మరే ఇతర మిక్చర్ లను వినియోగించడం లేదు. పిల్లెట్ ఫీడ్ మాత్రం సాయంత్రం సమయంలో వేస్తాం. దీనిని డెయిరీ వాళ్లు మాకు సరఫరా చేస్తారు.
డెయిరీకి పాలు విక్రయిస్తాం..
మేం పాకాల దగ్గర ఉన్న శ్రీనివాస డెయిరీకి పాలు విక్రయిస్తాం. ఇక్కడికి రవాణా సౌకర్యం సరిగా లేదు. మేం కొంతదూరం తీసుకెళ్తే వాళ్లు ఆటోలో వచ్చి పాలను తీసుకెళ్తారు. ఉదయం పూట 25-30 లీటర్ల పాలు వరకు ఉత్పత్తి అవుతాయి. సాయంత్రం కూడా ఇంచుమించు ఇదే తరహాలో పాలు వస్తాయి. వాతావరణంలో ఏమైనా మార్పులు సంభవించినా.. లేదా పశువులకు ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మినహా రోజుకి దాదాపు 60 లీటర్ల పాలు దిగుబడి వస్తోంది. ప్రస్తుతం ఆరు ఆవులు పాలు ఇస్తున్నాయి. ఒక్కో ఆవు సుమారు దాదాపు ఉదయం, సాయంత్రం కలుపుకొని 10 లీటర్లు ఇస్తోంది. ఇందులో కొన్ని తక్కువ ఇచ్చేవి ఉంటాయి. మరికొన్ని ఎక్కువ ఇచ్చేవి ఉంటాయి.
ఈనిన తొమ్మిది నెలల పాటు పాల దిగుబడి..
దాదాపు ఒక్కో ఆవు ఈనిన నాటి నుంచి తొమ్మిది నెలల పాటు పాలు ఇస్తుంది. వాటి శరీరాకృతి తదితర అంశాలపై వాటి దిగుబడి ఆధారపడి ఉంటుంది. కొన్ని ఉదయం, సాయంత్రం కలిపి 5 లీటర్లే ఇస్తాయి. మరికొన్ని 16లీటర్లు ఇస్తాయి. కొన్ని చూడి ఆవులు ఉంటాయి. అవి పెరిగే కొద్దీ దిగుబడి తగ్గుతూ ఉంటుంది.
రోజుకి రూ.2వేల ఆదాయం..
ఆవుపాల ధర లీటరు వచ్చేసరికి రూ.30-35 వరకు ఉంటుంది. దాని వెన్న శాతం ఆధారంగా రూ.40వరకు కూడా రావొచ్చు. ఇందులో మార్పులు చేర్పులు జరగుతూ ఉంటాయి. రోజూ 60లీటర్ల పాలు విక్రయిస్తున్నాం కాబట్టి ఉదయం ఒక రూ.1000, సాయంత్రం రూ.1000 చొప్పున రోజూ రూ.2వేల వరకు ఆదాయం వస్తోంది. రోజూ రూ.300 వరకు ఖర్చులు ఉంటాయి. అంటే మందులు, ఆహారం లాంటివి అన్నీ కలుపుకొని రూ.300 వరకు అవుతాయి. మేం చిన్నప్పటి నుంచి పెంచుతున్నాం కాబట్టి వాటికి ఏమైనా గాయాలైనా.. ఇతర ఆరోగ్య సమస్యలు మాకు తెలిసిపోతుంటాయి. దానికి సంబంధించిన మందులను తీసుకువచ్చి భద్రపరుస్తాం. అవసరం వచ్చినప్పుడు వినియోగిస్తాం. అంటే ప్రథమ చికిత్స అందించి వైద్యులను సంప్రదిస్తాం. ఇలా నెలకు రూ.10వేలు ఖర్చులకు పోయినా.. రూ.50వేల వరకు ఆదాయం ఉంటుంది. పాల దిగుబడిని బట్టి ఈ ఆదాయం పెరగవచ్చు.. లేదా తగ్గొచ్చు.
నాకు నష్టం రాలేదు..
చాలా మంది రైతులు నష్టం వచ్చింది అంటుంటారు. నాకు ఇప్పటి వరకు అంటే 14 ఏళ్లుగా నష్టం రాలేదు. కొంతమంది అవగాహన రాహిత్యం, సరైన జాగ్రత్తలు పాటించకపోవడం, పశువులను సరిగా చూసుకోకపోవడం వంటి కారణాల చేత పెట్టిన పెట్టుబడి రాక నష్టపోతుంటారు. మేం రోజుకి మూడు సార్లు మేత వేస్తాం. మాకున్న సొంత భూమిలో షెడ్ నిర్మాణం చేపట్టి.. కేవలం పశువులకు సంబంధించిన గడ్డి జాతులనే పెంచుతాం. కూరగాయాలు మరే ఇతర ఆహార పంటలు సాగు చేయం. మాకు తిండి గింజల కోసమని 15 సెంట్లలో(ఎకరానికి 100 సెంట్లు) వరి వేశాం.
కుటుంబ సభ్యులమంతా ఇదే పని..
మేం అమ్మా, నాన్న, నేను ఇదే పని చేస్తుంటాం. మరే ఇతర పనులు చేయం. మాకు కూలీల అవసరం కూడా లేదు. గడ్డి కోయడం, పాలు పితకడం, మేత వేయడం, నీరు పెట్టడం తదితర పనులన్నీ మేమే చేసుకుంటాం. ఈ పనులు ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటాం. ఆవులను మధ్యాహ్న సమయంలో మేతకు వదులుతాం. ఒకే చోట కట్టేసి మేత వేసినా పెంచినా అంతగా ప్రయోజనం ఉండదు. అవి కూడా తిరిగితేనే ఉత్సాహంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు చిన్నప్పటి నుంచి మా అమ్మానాన్న నేను ఇవే పనులు చేస్తున్నాం కాబట్టి ఏమంత కష్టం అనిపించడం లేదు. ఒక అలవాటుగా మారిపోయింది. కేవలం గడ్డి కత్తిరించడం, కోయడం వరికే యంత్రాలను ఉపయోగిస్తాం. పాలు పితకడం వంటి వాటిని మేమే చేస్తుంటాం. ప్రస్తుతం మేం చేస్తున్న పని పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఆదాయం కూడా బాగుంది.
ఎమ్మెస్సీ బోటనీ చదివి.. డెయిరీ ఫాం నిర్వహిస్తూ.. మరోవైపు సమయాన్ని వృథా చేయకుండా సివిల్స్ వైపు అడుగులేస్తూ.. ఖాళీ సమయాల్లో ఆన్ లైన్ క్లాసులు వింటున్న గణపతి కుమార్ గారు.. సమయాన్ని వృథా చేయకుండా వినియోగించుకుంటున్న తీరు పలువురికి అనుసరణీయం.