![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/IMG_4898-scaled-e1717581935581-1024x688.jpg)
సహజంగా పంట మార్పిడి చేసే రైతులను మనం చూస్తుంటాం. అలాగే డెయిరీ ఫాం, చేపల పెంపకం, గొర్రెలు పెంచేవారిని మనం పరిశీలిస్తుంటాం. కానీ వాటన్నింటికి భిన్నంగా మునగ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు కలిదిండి సత్య నారాయణ గారు. మునగ సాగులో వింత ఏముంది అనుకుంటున్నారా.. మునగ కాయలతో పాటు వాటి ఆకులను కూడా విక్రయిస్తూ ఔరా అనిపిస్తున్నారు.
![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/Screenshot-2023-12-10-at-7.30.20 PM-150x150.png)
ఎలా అనుకుంటున్నారా.. అయితే ఇది చదివేద్దాం..
నమస్తే అండి. మాది మేడ్చల్-మల్కాజగిరి జిల్లాలోని మూడు చింతలపల్లి మండలంలోని కొంతూరు గ్రామం. మేం ఇక్కడ రెండేళ్లుగా మునగ సాగు చేపడుతున్నాను. దీంతో పాటు బంతి, బోడ కాకర, చిక్కుడు తో ఇతర పంటలను సాగు చేస్తున్నాను.
ఆరు ఎకరాల్లో.. మూడు చోట్ల…
నేను మొత్తం ఆరు ఎకరాల్లో మునగ సాగు చేస్తున్నాను. రెండు ఎకరాల బిట్లు చొప్పున మూడు చోట్ల మునగ విత్తనాలు నాటాను. అందులో ఓ రెండు ఎకరాలు ఇటీవలే సాగు మొదలు పెట్టాం. అక్టోబరులో వీటిని నాటడం వల్ల ఏప్రిల్, మేలో పూత వచ్చి దిగుబడికి వచ్చింది. జూన్, జులై లో సాగు చేసినట్లయితే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నవంబరు, డిసెంబరులో కోతకు వచ్చేది. సాధారణంగా డిసెంబరు, జనవరిలో మునక్కాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే కాపు తక్కువగా ఉంటుంది. ఎండాకాలం వచ్చేసరికి అన్ని చోట్ల చెట్లు కాయలు కాస్తాయి. మార్కెట్ లో ధర అంత ఎక్కువగా ఏం ఉండదు.
ట్రాక్టర్ ర్ తిరిగేందుకు వీలుగా..
మేం ఒక్కో మొక్క మధ్య దూరం 7 అడుగులు, సాలుకి సాలుకి మధ్య 16అడుగులు ఉండేలా విత్తానాలు నాటాం. ఎక్కువగా ట్రాక్టర్ తో వ్యవసాయం చేస్తాం. దున్నడం దగ్గర నుంచి మందుల పిచికారీ వరకు. అందువల్ల ట్రాక్టర్ తిరిగేందుకు వీలుగా మొక్కలు నాటాం. అయితే ఇలా దూరం గా నాటడం వల్ల మొక్కకు గాలి, వెలుతురు కూడా బాగా వస్తోంది. ఫలితంగా మంచి దిగుబడి వస్తోంది.
ఎకరానికి 600-650 మొక్కలు..
![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/IMG_4896-1024x683.jpg)
సుమారు ఎకరానికి 600-650 మొక్కలు వరకు ఉండొచ్చు. మునగలో రెండు మూడు రకాలు ఉంటాయి. మేం తమిళనాడుకి చెందిన ఒడీసీ అనే విత్తనం నాటాం. వీటిని ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాం. దీనికి విత్తన ఖర్చు పెద్దగా ఏం ఉండదు. ఎకరానికి రూ.500-600వరకు ఉంటుంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులకు ఈ మొక్కలు ఎదుగుతాయి. మాములుగా దున్ని విత్తనాలు నాటాం. ఏదైనా మొలకెత్తకపోతే మరోసారి నాటాం. దాదాపుగా అన్ని చోట్ల మొలిచాయి.
మునగకు నీరు కావాలి..
చాలామంది మునగకు నీరు పెద్దగా అవసరం ఉండదు అని అంటుంటారు. మనం ఇంటి దగ్గర ఒకటీ, రెండు మొక్కలకి అయితే నీరు పెద్దగా అవసరం లేదు. కానీ వ్యాపార నిమిత్తం సాగు చేస్తున్నాం కాబట్టి మొక్క ఎదిగే దశలో సరిపడా నీరు పెడుతూ.. పూత, కాయ కాసే దశలో అధికంగా అందించాలి. పూత దశ వరకు తక్కువ నీటినే అందించాలి. చెట్టు ఎప్పుడు పచ్చగా ఉండేలా చూసుకోవాలి. వాడిపోయినట్టు ఉండకూడదు.
సాగు విధానం..
విత్తనాలు నాటడానికి ముందు పశువుల పేడను ఎరువును వేశాం. మల్చింగ్ షీట్లు కూడా పెట్టాం. విత్తనం నాటిన ఐదారు నెలల వరకు మొక్కను రక్షించుకునేందుకు మల్చింగ్ షీట్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దీనిని తొలగించాం. ప్రారంభంలో కలుపు కూడా తక్కువగానే వస్తోంది. ట్రాక్టర్ తో రెండు సార్లు దున్నకం చేపట్టాను. సుమారు ఎకరానికి రూ.50-60వేల పెట్టుబడి అవుతుంది.
తొలి ఏడాది రూ.2,25,000..
![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/Screenshot-2023-12-10-at-7.31.05 PM-1024x577.png)
మునగ కొంత ఆలస్యంగా సాగు చేయడం వల్ల దిగుబడి వచ్చినా సరైన ధర లేక ఆదాయం ఎక్కువగా రాలేదు. ఇతర పంటలు సాగు చేస్తాం కాబట్టి సూపర్ మార్కెట్ వాళ్లతో టై అప్ లో ఉన్నాం. వాళ్ల ద్వారా కొంత మేర ఆదాయాన్ని పొందాం. కేజీ 20-25 వరకు విక్రయించాం. ఇక్కడ కేజీల లెక్క అమ్ముతాం. కాయల సంఖ్య ఆధారంగా కాదు. ఇదే సమయంలో బయట మార్కెట్ లో కేజీ 15-20 మాత్రమే ఉంది. ఇక్కడి రెండు ఎకరాలు చూసుకుంటే మొత్తం సుమారు 15 టన్నుల దిగుబడి వచ్చింది. టన్నుకు రూ.15వేల చొప్పున వేసుకున్నా.. రూ.2,25,000 ఆదాయం వచ్చింది. తక్కువగానే వచ్చినట్లు. అక్టోబరులో విత్తనాలు నాటి ఏప్రిల్ లో పంట చేతికి వచ్చింది. చెట్టు ఎదుగుదల కూడా అంత ఎక్కువగా లేకపోవడంతో దిగుబడి కొంచెం తక్కువ గానే వచ్చింది.
క్రూనింగ్ చేశాం..
పంట మొత్తం అయిపోగానే వీటిని క్రూనింగ్ చేశాం. అంటే చెట్టులను తొలగించాం. మొదలు వరకు ఉంచి ఆ పైభాగం నరికేశాం. ఇప్పుడు మళ్లీ కొత్త శాఖలు పుట్టుకొచ్చాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అధిక వర్షాల వల్ల ఆకు పచ్చగా ఉన్నప్పటికీ పండిపోయి వదిలేసింది. ఇవి వర్షాన్ని, తేమను ఎక్కువగా తట్టుకోలేవు. అవసరానికి అనుగుణంగా నీటిని అందించాలి. పెరిగిన మొక్కలో కూడా ఇప్పటికీ రెండు సార్లు చిగురులను తుంచేశాం. లేకపోతే పెరిగిపోతుంటాయి. దానిని మనం నియంత్రించాలి. అలా చేస్తే పక్క శాఖలు కొత్తగా పుట్టుకొస్తాయి. ఈ సారి డిసెంబరు, జనవరిలో పంట దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సారి ఎకరానికి 10 టన్నుల చొప్పున 20 టన్నులకు పైగా దిగుబడి వస్తోందని అంచనా వేస్తున్నాం. రూ.3లక్షల ఆదాయం రావొచ్చు.
దీనికి ఎక్కువగా పచ్చ పురుగు, బొంత పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. మునగ ఆకును పౌడర్ చేసి విక్రయిస్తాం కాబట్టి.. సేంద్రియ ఎరువులు వాడతాం. వేపనూనెను ఎక్కువగా వినియోగిస్తాం. ఏదైనా తెగులు వచ్చినా.. పండుటాకు రాలిపోయినా.. వర్షాలు ఎక్కవగా ఉంటే కాండానికి మచ్చ వస్తోంది. ఇలాంటి సమయంలో పుల్లటి మజ్జిగ, పసుపు కలిపి పిచికారీ చేస్తాం. మేం ఒక దేశీ ఆవును కూడా పెంచుతున్నాం. ఆకును పౌడర్ చేసి విక్రయిస్తున్నాం కాబట్టి.. సేంద్రియ ఎరువులనే వాడుతున్నాం..
ఆకు రూపంలో లాభం ఎలా..
జూన్, జులైలో ఆకు ఉన్నా దానిని పౌడర్ చేసి విక్రయించడానికి రాదు. మనుషుల సాయంతోనే వాటిని తుంచి.. శుభ్రంగా కడిగి ఏమైనా ఆకు డ్యామేజీ అయితే తీసేస్తాం. ఆ తర్వాత దీనిని ఆరబెడతాం. పూర్తిగా ఎండిన తర్వాత గ్రీనీష్ పోకుండా పొడి చేసుకోవాలి. అంటే ఆకులను ఎండలో ఆరబెట్టకూడదు. నీడలోనే ఆరబెట్టాలి. మే నెలలో అయితే నాలుగైదు రోజుల్లో పూర్తిగా ఆరిపోతుంది. చలికాలంలో అయితే వారం పది రోజుల సమయం పడుతుంది. ఆకు మెత్తబడిపోతుంది. ఇప్పుడు పౌడర్ చేయడం కూడా అంత శ్రేయస్కరం కాదు. వీటిని ఎండాకాలంలోనే చేయాలి. ఒకవేళ సోలార్ డ్రైయ్యర్లు, ఎలక్ర్టిక్ డ్రైయ్యర్లు ఉంటే చేసుకోవచ్చు. మేం వీటిని సహజసిద్ధంగా పొడి చేస్తున్నాం.
పౌడర్ ధర కేజీ రూ.1800
ఉదాహరణకు మనం ఒక పది కేజీల మునగాకును తీసుకొని.. ఆరబెడితే రెండు మూడు కేజీల ఎండు ఆకు అవుతుంది. దీనిని పొడి చేస్తే 700-800 గ్రాముల పౌడర్ వస్తోంది. పది కేజీల మునగాకు నుంచి 800గ్రాముల పౌడర్ వస్తోంది. ఇలా వచ్చిన పౌడర్ ని కేజీ రూ.1800 చొప్పున విక్రయిస్తున్నాం. సేంద్రియంగా తయారు చేస్తున్నాం కాబట్టి ఇంత ధర. బయట ఇంతకన్నా తక్కువ ధరల్లో కూడా లభిస్తాయి.
లాభాలు..
మునగాకు పౌడర్ వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. షుగన్ అదుపులో ఉంటుంది. దీంతో పాటు వ్యాధినిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. కరోనా నుంచి ఈ పౌడర్ కి డిమాండ్ బాగా పెరిగింది. గతేడాది సుమారు ఒక 20 కేజీల వరకు తయారు చేసి ఇచ్చాం. కేవలం ఎండాకాలంలోనే తయారు చేస్తాం. మిగతా కాలాల్లో చీడ పీడలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే తయారు చేయం. ఆకు పచ్చగా ఉంటేనే ఆ పౌడర్ కి విలువ. మునగాకు ను కొన్ని కంపెనీల వాళ్లు కొంటారని విన్నాను. అయితే ఈ రకం మునగాకు ప్రయాణానికి ఎక్కవ ఆగదు. వాడిపోయి రాలిపోతుంది. మన వాతావరణ పరిస్థితులను అనుసరించి కత్తిరించిన నాలుగైదు గంటలు తాజాగా ఉంటుంది.
సాగు శ్రమ తక్కువ..
అయితే నేను గతంలో అనేక రకాలైన కూరగాయల సాగు చేపట్టాను. వాణిజ్య పంటైన పొగాకు, పండ్ల రకానికి చెందిన ద్రాక్ష, బంతిపూలు కూడా సాగు చేశాను. ఈ పంటలను పోల్చి చూసినప్పుడు మునగకు తక్కువ పెట్టుబడి అవుతుంది. కూలీల అవసరం కూడా పెద్దగా ఉండదు. ఇద్దరు కూలీలను పెట్టుకున్నా పంటను సులభంగా తెంపేయొచ్చు. ఎప్పుడైనా పంట దిగుబడి వస్తోంది కాబట్టి రేట్ ను చూసుకొని విత్తనాలు విత్తి మనం అనుకున్న సమయానికి పంట తెంపుకోవచ్చు. ఎకరానికి రూ.50వేలు కంటే ఎక్కువ అవ్వదు. ఆదాయం రూ. 1,50,000 నుంచి రూ.2లక్షల వరకు పొందవచ్చు. ధరలు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి.
రైతులు పంట సాగు చేయడమే కాదు. పంట ఉత్పత్తులను ఎలా ఉపయోగపడతాయో తెలుసుకొని దానికి అనుగుణంగా మారాలి. మునక్కాయలే కాకుండా.. మునగాకు ను సైతం విక్రయిస్తూ లాభాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు కలిదిండి సత్యనారాయణ గారు.