![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/IMG_0577-768x1024.jpg)
అందరిలా సాగు చేస్తే మజా ఏం ఉంటది అనుకొని.. ఇప్పటి వరకు మార్కెట్ లో లేని పంటను పరిచయం చేద్దామనుకున్నారు. పదిమంది తనను అనుసరించాలనే ఉద్దేశంతో.. విదేశాలకే పరిమితమైన డ్రాగన్ ఫ్రూట్ రుచిని మన వారికి చూపిస్తూ.. సాగు చేసి లాభాలు గడిస్తున్నారు రమేశ్రెడ్డి గారు. రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ గురించి మనందరకి తెలిసిందే. కానీ ఎల్లో(పసుపు) కలర్ డ్రాగన్ గురించి మనకి పెద్దగా తెలియదు. ఈ ఫ్రూట్ విశేషాలను మన రైతుబడిలో పంచుకున్నారు.
మాది.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామం. మాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఆరేళ్ల నుంచి డ్రాగన్ సాగు చేపట్టాను. ఎల్లో కలర్ డ్రాగన్ మాత్రం రెండేళ్ల నుంచి ప్రారంభించాను. రెడ్ ఫ్రూట్ డ్రాగన్ కి విభిన్నంగా సాగు చేద్దామని అనిపించింది. అందుకే ఈ సారి ఎల్లో కలర్ ప్రయత్నించాను.
సాగు విధానం..
ఎకరానికి రెండువేల చొప్పున డ్రాగన్ మొక్కలను నాటాం. ప్రత్యేకంగా వీటి కోసం స్తంభాలను పాతి ఒక్కోదానికి నాలుగు మొక్కల చొప్పున పెంచుతున్నాం. ఒక్కో పోల్ కు మధ్య ఎనిమిది అడుగులు.. అడ్డం పది అడుగులు ఉండేలా ఏర్పాటు చేశాం. ఇలా ఎకరానికి 450-500 వరకు స్తంభాలు అవసరమయ్యాయి. ఎల్లో కలర్ డ్రాగన్ రెండెకరాల్లో సాగు చేశాను. సుమారు 4,000 మొక్కల వరకు నాటాం. గతేడాది 500కేజీల దిగుబడి వచ్చింది. తొలి దశలో చెట్టు పెరగడం అవసరం కాబట్టి దిగుబడి పై అంతగా ఆసక్తి చూపలేదు. మొక్క ఎదుగుదలకే ప్రాధాన్యం ఇచ్చాను. ప్రూట్ వచ్చిన కొమ్మలను కత్తిరించి వాటిని నర్సరీ చేశాం. అందుకే దిగుబడి తక్కువగా వచ్చింది.
రెంటి మధ్య వ్యత్యాసం
సాధారణంగా ఎరుపు రంగు డ్రాగన్ ఫ్రూట్ లో లోపల కొన్ని ఎర్రగా ఉంటాయి. కొన్ని తెల్లగా ఉంటాయి. ఎల్లో కలర్ డ్రాగన్ లో మాత్రం లోపలి భాగం తెల్లగా ఉంటుంది. మూడు రకాలు కూడా ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. ఒకదానికి ఇంకో దానికి సంబంధం ఉండదు. అన్నింటికంటే తీయగా ఉండేది మాత్రం ఎల్లో కలర్. ఎల్లో తర్వాత రెడ్, తెలుపు ఇలా ఉంటాయి. పంట ఇప్పుడు దిగుబడి దశకు వచ్చింది. ఈ సారి దాదాపు రెండు నుంచి మూడు టన్నుల దిగుబడి వస్తోందని ఆశిస్తున్నాం.
ఎల్లో పంటనే ఎందుకంటే..
రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ సాగు కూడా లాభాలు బాగానే వస్తాయి. కానీ పంటల్లో వైవిధ్యం ఉండాలని నేను అనుకుంటాను. నేను ఏడేళ్ల క్రితం డ్రాగన్ సాగు చేపట్టిన అప్పుడు కూడా రాష్ట్రంలో సాగుచేసిన తొలి కొద్ది మందిలో నేను ఒకర్ని. ఇప్పుడు ఎల్లో ఏదైతే కొత్తగా ఉందో అప్పుడు రెడ్ కలర్ కూడా వైవిధ్యంగా అనిపించింది. మార్కెట్ లో పోటీ లేని పంట సాగు చేస్తే లాభాలు అధికంగా వస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో అందరూ కూడా డ్రాగన్ సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. అందరికి సాగు విధానం తెలిసింది. కాబట్టి సులభంగా అందరూ పంటలు వేసి రోడ్లపై విరివిగా అమ్ముతున్నారు. అదే సమయంలో జనాలు కూడా బాగానే కొంటున్నారు. నేను పంటసాగు చేసిన తొలినాళ్లలో కేజీ రూ.250 ఉంటే ఇప్పుడు రూ.100-120 పలుకుతోంది. అప్పటితో పోల్చితే వీటిని కొనే జనం కూడా పెరిగారు.
రైతుకి పెద్ద నష్ట ఉండదు..
ధర తక్కువ కావడం వల్ల రైతుకి ఏ మాత్రం నష్టం ఉండదు. సుమారు కేజీ రూ.40-50 మధ్య అమ్మినా కూడా కర్షకుడికి జరిగే నష్టం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతీసారి పంటను సాగు చేయాల్సిన అవసరం ఉండదు. పంట తొలినాళ్లలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దిగుబడి తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి సాగు వ్యయం పెద్దగా ఏమీ ఉండదు. మందులు, ఎరువులు వేయడం మినహా ఖర్చులు ఉండవు.
ఒక్కో మొక్క రూ.250
ఒక్కో మొక్కను రూ.250 వెచ్చించి కొనుగోలు చేశాను. వీటిని కేరళలోని ఓ వ్యక్తి ఆయన ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. ముందుగా రెండు వందల మొక్కలను తీసుకువచ్చి వాటిని అభివృద్ధి చేసి ఆ తర్వాత పొలంలో నాటాం. అలా నాకు రూ.40-50 వేల ఖర్చు అయింది. ఆ తర్వాత నేను నర్సరీ ద్వారా సొంతంగా మొక్కలు తయారు చేసుకున్నవే. వేరు వచ్చిన ఏ మొక్క నుంచి అయినా సరే వీటిని కట్ చేసి అభివృద్ధి చేయవచ్చు. ఎకరానికి స్తంభాలు, మొక్కలు, గోతులు తీయడం ఇతరత్రా వాటిని చూసుకుంటే ఎకరానికి రూ.5-6 లక్షల వరకు ఖర్చు అయింది. అయితే దీనిపై అవగాహన లేక రైతులు దీని సాగుపై అంత ఆసక్తి చూపడం లేదు.
మార్కెట్ కి పరిచయం చేస్తున్నాం..
ఏదైనా వ్యాపారం మంచిగా లాభాలు గడించాలంటే ముందు ఆ వస్తువు జనంలోకి వెళ్లాలి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత వాసులందరికీ కూడా రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసు. కానీ ఎల్లో కలర్ డ్రాగన్ గురించి ఎవరికి తెలియదు. ఇవి బయట మార్కెట్ లో కేజీ రూ.230-250 వరకు పలుకుతోంది. కానీ దీనిని జనాలకు పరిచయం చేయాలని కేజీ రూ.150-180 వరకు విక్రయిస్తున్నాం. గతేడాది రూ.400 ఉంది. నేను పంట సాగు చేసినప్పుడు రూ.700 కూడా పలికింది. మేం వీటిని సూపర్ మార్కెట్ లకు పంపిస్తున్నాం. అలాగే ముంబయి కి చెందిన ఓ వ్యాపారికి కూడా విక్రయిస్తున్నాం.
నీరు తక్కువగా అందించాలి..
డ్రాగన్ సాగుకు పెద్దగా నీటి వినియోగం అవసరం లేదు. ఎంత తక్కువ నీరు అందిస్తే అన్ని ఫంగస్ వ్యాధులు తక్కువగా వస్తాయి. మేం డ్రిప్పు పైపుల ద్వారా నాలుగైదు రోజులకు చెట్టుకు సుమారు 4-8 లీటర్ల నీటిని అందిస్తున్నాం. వర్షాలు పడితే ఏం కాదు. ఏ నేలలో అయినా సరే వీటిని పండించవచ్చు. డ్రాగన్ మొక్క వేరు ఎక్కువగా భూమి లోపలకి వెళ్లదు. పక్కకి వెళ్తూ ఉంటుంది. ఒక అడుగు నుంచి రెండు అడుగులు మేర సారవంతమైన మట్టి పొర ఉంటే చాలు. రెడ్ కలర్ వాటితో పోల్చితే ఎల్లో కలర్ కు తెగుళ్లు కొంచెం ఎక్కువగా వస్తాయి. వర్షాలు పడిన సమయంలో జామ ఆకుపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. తర్వాత అవే వ్యాపిస్తుంటాయి. దీనికి ఇవే తరహా మచ్చలు ఏర్పడతాయి. దీనికి చీమల సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ పండు ఏర్పడే సమయంలో కొంత ద్రవ పదార్థం బయటకు వస్తుంది. ఆ సమయంలో చీమలు ఎక్కువగా వస్తుంటాయి. దీనివల్ల ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే పండు పై భాగంలో మచ్చలు ఏర్పడతాయి తప్ప లోపల ఏం కాదు. కానీ అవి చూడటానికి అంతగా బాగోవు. అలా ఉన్న వాటిని కొనేందుకు ఎవరూ కూడా పెద్దగా ఆసక్తి చూపరు.
మార్కెటింగ్ పెంచడమే లక్ష్యం..
ఈ ఏడాది టన్నున్నర నుంచి రెండు టన్నుల పంట దిగుబడి వస్తోందని భావిస్తున్నాం. వీటిని పరిచయం చేసేందుకు ఎక్కవగా విక్రయిస్తున్నాం. బయటి మార్కెట్ కు విక్రయిస్తే కేజీకి రూ.50 వరకు అధిక ఆదాయం వస్తోంది. కానీ మార్కెటింగ్ పెంచాలనే చూస్తున్నాం. మా ఫాం పేరుతో ప్రత్యేకంగా 10 కేజీల బాక్సులు ఏర్పాటు చేసి వాటిని విక్రయిస్తున్నాం. మేం పంటను హోల్ సేల్ తో పాటు రిటైల్ గా విక్రయిస్తున్నాం. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు వినియోగించుకుంటూ వ్యాపారం వృద్ధి చేసుకుంటున్నాం. రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అయితే బాక్స్ రూ.1600, ఎల్లో కలర్ అయితే రూ.2000 చొప్పున విక్రయిస్తున్నాం. విడిగా రెడ్ డ్రాగన్ సైజులు బట్టి కేజీ 80-130 కి, ఎల్లో కలర్ రూ.180-200 వరకు అమ్ముతున్నాం.
పెట్టుబడి సొమ్ము రెండేళ్లలో చేతికి..
సుమారు ఒక ఎకరా పంటకు రూ.5లక్షల ఖర్చు అవుతుంది. ఎల్లో కలర్ డ్రాగన్ ని తీసుకుంటే కేజీ రూ.200-250వరకు ధర పలుకుతుంది. ఏడాదికి ఒక టన్ను దిగుబడి వచ్చినా.. రెండేళ్లలో ఆయన పెట్టుబడి రూ.5లక్షలు సులభంగా వస్తుంది. మూడో ఏడాదిలో మూడు నుంచి ఐదు టన్నుల దిగుబడే వచ్చినా కూడా కేజీ రూ.150 చొప్పున వేసుకున్నా.. రూ.7లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు రూ. లక్ష తీసేసినా.. ఆరు లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. ఎల్లో కలర్ డ్రాగన్ ఇంకా పరిచయం కాలేదు కాబట్టి వీటిని తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఒక్కసారి తింటే మాత్రం కచ్చితంగా దీని వైపే చూస్తారు.
వైవిధ్యంగా పంటలు సాగు చేయడమే ఒక ఎత్తు. అందులోను వెరైటీ లు పంటలు వేస్తూ.. దిగుబడికి తగ్గట్లుగా మార్కెటింగ్ వసతులు కల్పించుకుంటూ.. ఆదాయం గడిస్తున్న రమేశ్ రెడ్డి గారు రైతన్నలకు ఆదర్శం.
![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/IMG_0728-1-150x150.jpg)
![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/IMG_5149-150x150.jpg)
![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/Screenshot-2023-12-10-at-7.47.15 PM-150x150.png)
![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/IMG_5172-2-150x150.jpg)